ఝార్ఖండ్ T20 ఫైనల్: స్టేడియం బయట తొక్కిసలాట.. మంత్రి కీలక ప్రకటన

  • ఝార్ఖండ్ T20 ఫైనల్ మ్యాచ్ వద్ద తొక్కిసలాట
  • ఉచిత ప్రవేశంతో భారీగా తరలివచ్చిన ప్రేక్షకులు
  • కొంతమందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్న మంత్రి
  • నిరాటంకంగా కొనసాగిన క్రికెట్ మ్యాచ్
జార్ఖండ్ రాజధాని రాంచీలో నిన్న సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక జేఎస్‌సీఏ (JSCA) అంతర్జాతీయ స్టేడియం వెలుపల తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొనడంతో పలువురు గాయపడ్డారు. జార్ఖండ్ టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన సంభవించింది.

మ్యాచ్ వీక్షించేందుకు ఉచిత ప్రవేశం కల్పించడంతో ప్రేక్షకులు ఊహించని రీతిలో భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు లక్ష మందికి పైగా జనం ఒక్కసారిగా స్టేడియం వద్దకు చేరుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు. అయితే, స్టేడియం వెలుపల గందరగోళం నెలకొన్నప్పటికీ, లోపల మ్యాచ్ మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగింది.

ఈ ఘటనపై జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ తక్షణమే స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. సమీప ఆసుపత్రులను అప్రమత్తం చేయడంతో పాటు ఘటనా స్థలానికి అంబులెన్సులను పంపినట్లు పేర్కొన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్య శాఖ పూర్తిస్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమైందని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ ఘటనలో సుమారు నలుగురైదుగురికి గాయాలయ్యాయని, వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని రాంచీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.                                

Jharkhand T20 League
Ranchi JSCA Stadium
Irfan Ansari
Ranchi Stampede
Jharkhand Cricket
JSCA Stadium Crowd

More Telugu News